16-08-2025 12:22:22 AM
జగన్నాటక సూత్రధారి కరవాలము చేతబూని రణరంగంలోకి దిగితే? ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదూ! ఔను, శ్రీకృష్ణున్ని యుద్ధవీరుడిగా వెండితెరపై చూపించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించాయి అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్టైన్మెంట్. ఈ ఉభయ సంస్థలు సంయుక్తంగా ఓ చారిత్రక మహాకావ్యాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నాయి. ఈ మేరకు టైటిల్ను సైతం మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
‘శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా’ పేరుతో రూపుదిద్దు కోనున్న ఈ సినిమా నిర్వహణ బాధ్యతలను అనిల్ వ్యాస్ నిర్వర్తిస్తుండగా.. ముకుంద్ పాండే కథ, స్క్రీన్ప్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా 11-12వ శతాబ్దం నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని, శ్రీకృష్ణుడి దివ్యత్వాన్ని, ధీర త్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని తెరపై చూపించబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. చలనచిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీకృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇదని వెల్లడించారు.
ఒక పాన్-వరల్డ్ ప్రాజెక్ట్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రపంచ స్థాయి టెక్నీషియన్లతో తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇస్కాన్ ఢిల్లీకి చెందిన సీనియర్ బోధకుడు ‘జితామిత్ర ప్రభుశ్రీ’ ఆశీస్సులతో ఈ సరికొత్త దృశ్యకావ్యం రూపొం దుతోందని మూవీ టీమ్ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.