08-07-2025 07:44:30 PM
జిల్లా విద్యాధికారి రాజేందర్..
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం బెగ్లూర్ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా విద్యాధికారి రాజేందర్(District Education Officer Rajender) మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ... బెగ్లూరు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల నమోదును ఎక్కువగా పెంచడం చాలా అభినందనీయమని అన్నారు. గ్రామ పెద్దల సహకారంతో పిల్లల నమోదు శాతానికి (ఎన్రోల్మెంట్) కృషిచేసిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను సన్మానించినారు. బెగ్లూర్ ప్రాధమికోన్నత పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా ప్రగతికి అనేక సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కువగా చొరవ తీసుకుంటుందని ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలన్నారు. నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఉపాధ్యాయులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఉచిత దుస్తులు., పుస్తకాలు, రుచికరమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని, పాఠశాల అభివృద్ధికి గ్రామ పెద్దలు కూడా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామల రమేష్, చల్లా కిషన్ రెడ్డి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామ్మూర్తి., ఏ ఏ పి సి చైర్మన్, ఉపాధ్యాయులు దాదాపుగా 125 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.