03-12-2025 12:00:00 AM
తెలంగాణ ఘనమైన చరిత్రను, అస్తిత్వాన్ని మరోసారి కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ (KTCB), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘తెలంగాణ పునర్దర్శనం’ (Re Telangana) పేరుతో బృహత్తరమైన చరిత్ర సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు 2026 జనవరి 10న హైదరాబాద్లోని రవీంద్రభారతి వేదికగా జరగనుంది.
తెలంగాణ నేల కేవలం భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు, ఇది చరిత్రకు సాక్ష్యం. ఆది మానవుడు సంచరించిన రాతి యుగాల నుంచి అద్భుతమైన కాకతీయుల వాస్తుశిల్ప సంపద వరకు, శాతవాహనుల నాణేల నుంచి ఆధునిక సాహిత్య చరిత్ర వరకు ఎన్నో అంశాలు ఇంకా వెలుగు చూడాల్సిన అవసరముంది. ఈ సదస్సు ప్రధాన లక్ష్యం తెలంగాణ చరిత్రను ‘పునర్దర్శనం’ చేయడం. ఇందులో భాగంగా కింది ఆసక్తికరమైన అంశాలపై లోతైన చర్చ జరగనుంది.
* పురావస్తు సంపద చిత్రాలు: తెలంగాణ గుహల్లో దాగి ఉన్న వేల ఏళ్ల నాటి రాతి చిత్రాలు, రాతి యుగపు ఆనవాళ్లపై ప్రత్యేక విశ్లేషణ.
* శాసనాలు చరిత్రకు మౌలిక సాక్ష్యాలైన శాసనాలు, నాణేల అధ్యయనం ద్వారా నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయడం.
* సాహిత్యం శిల్పం: తెలంగాణ సాహిత్యంలో ప్రతిబింబించిన చరిత్రను, ఇక్కడి ఆలయాలు, కట్టడాలలోని శిల్ప సౌందర్యాన్ని వెలికి తీయడం.
* తులనాత్మక అధ్యయనం: భారతీయ చరిత్రతో తెలంగాణ చరిత్రను పోల్చుతూ, జాతీయ స్థాయిలో తెలంగాణ స్థానాన్ని సుస్థిరం చేయడం.
ఈ నేపథ్యంలో చరిత్రకారులు, పరిశోధకులు, విద్యార్థులు, ఔత్సాహికుల నుంచి పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నాము.
పత్ర సమర్పణకు సూచనలు:
పరిశోధన పత్రాలు తెలుగు లేదా ఆంగ్లంలో ఉండవచ్చు. పత్రం పూర్తిగా మీ సొంత పరిశోధనై ఉండాలి. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించిన పత్రాలు తిరస్కరించబడతాయి. తగిన ఫుట్నోట్స్, రిఫరెన్సులు పేర్కొనడం తప్పనిసరి. పత్రం యూనికోడ్ ఫాంట్లో, వర్డ్ డాక్యుమెంట్ రూపంలో ఉండాలి. ఫోటోలను (Jpeg) ఫార్మాట్లో విడిగా జతపరచాలి. పత్రం నిడివి 1200 పదాలకు మించి ఉండకూడదు. ఆసక్తి గల చరిత్రకారులు, రచయితలు తమ పత్రాలను పంపి ఈ చారిత్రక యజ్ఞంలో భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నాము.
సన్నాహక కమిటీ, కొత్త తెలంగాణ చరిత్ర బృందం, శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాస్, బీవీ భద్రగిరీశ్, బలగం రామ్మోహన్, బైరోజు శ్యాంసుందర్. సెల్ నంబర్: 9949498698