15-10-2025 01:04:18 AM
బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు.. మంత్రులు తుమ్మల, పొన్నం క్షమాపణలు చెప్పాలి
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి) : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ‘అసలు మనిషేనా..? మానవత్వం ఉందా..?’ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టారని, కోల్పోయిన తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే డ్రామా అంటారా? అని ఆయన మండిపడ్డారు.
మంగళవారం తెలంగాణ భవన్లో శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గం వాళ్లు ఓట్లు వేస్తే అదే సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారని, అదే సామాజిక వర్గం ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. మాగంటి సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎట్లా అవుతుందని మాజీ మంత్రి నిలదీశారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ వెంటనే బీఆర్ఎస్ నాయకురాలు, జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రుల భాషను మహిళలు వినాలని, ఆడబిడ్డను మంత్రు లు తుమ్మల, పొన్నం ప్రభాకర్ అవమానించారని ఆయన ఆరోపించారు. రాజీవ్ గాంధీ చనిపోతే దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ ఫొటోలతో ప్రచారం చేయలేదా..? అని ప్రశ్నించారు.