09-08-2025 01:58:14 AM
దళిత కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
గజ్వేల్, ఆగస్టు 8: తనకు రాజకీయ ఓనమాలు నేర్పించింది దళితులేనని, పార్టీ పరిష్టతకు కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ వారంలో ఒకరోజు దళిత కార్యకర్త కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనం చేయనున్నట్లు డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ దళిత నాయకుడు శివులు గృహంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం చేశారు.
తనను దళిత వ్యతిరేకిగా కొందరు పనిగట్టుకుని ప్రచారం చేయడం దురదృష్టకరమని, అయితే తన రాజకీయ జీవితం వర్గల్ దళితవాడల్లో ప్రారంభమైనట్లు గుర్తు చేశారు. తనకు దళితులే రాజకీయ ఓనమాలు నేర్పించి కాపాడుకున్నట్లు చెప్పారు. దళిత కుటుంబాలే తనను సర్పంచిగా నిలిపి గెలిపించినట్లు చెప్పారు. అంచలంచెలుగా ఎదిగి , ఎమ్మెల్యేగా గెలుపొందడంలో దళితుల కృషి ఎంతో ఉందన్నారు.
భూస్వామి కుటుంబం నుండి వచ్చిన తనకు ఆ లక్షణాలు ఎప్పుడూ లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీలో భాగంగా దళితుల ఇళ్లలో సహపంక్తి భోజనాలు చేసినట్లు తెలిపారు. రాజకీయ ఎదుగుదలతో విమర్శలు సహజమని, అందులో నిజం ఉండాలన్నారు. రాజకీయాల్లో ఆటు పోట్లు, కష్టసుఖాలు సహజమని, అయితే తనపై వచ్చిన అపవాదు తొలగించుకోవడం తన బాధ్యత అన్నారు.
ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ర్ట ఉపాధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మాజీ ఎంపీపీ మోహన్, పట్టణాధ్యక్షులు మొనగారి రాజు, నక్క రాములు, ఎఎంసి డైరెక్టర్ యాదగిరి, సుఖేందర్ రెడ్డి, కుంట్లా లక్ష్మరెడ్డి, డప్పు గణేష్, దయాల యాదగిరి, కర్ణకార్ రెడ్డి, నరసాగౌడ్, కొడకండ్ల నర్సింలు, పేర్క నాగరాజు, నక్క రేగొండ, అజ్గర్, గుంటుకు శ్రీను, కొండల్ రెడ్డి, ఉడెం శ్రీను, గాడిపల్లి శ్రీను, సూకం సురేష్, అరుణ్ తదితరుల పాల్గొన్నారు.