27-09-2025 05:19:10 PM
టాటా సహకారంతో ఏటీసీలు ఏర్పాటు
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): వివిధ సాంకేతిక కోర్సులలో శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగాలు పొందవచ్చు అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) అన్నారు. శనివారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ఐటిఐ ప్రాంగణంలో సుమారు 42.5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి 2400 కోట్ల రూపాయల వ్యయంతో 65 ఏటిసి కేంద్రాలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన అనంతరం నల్గొండలో మంత్రి నల్గొండ ఏటిసి ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టాటా సహకారంతో ఏటీసీలు ఏర్పాటు చేయడం జరిగిందని, నల్గొండ ఏటిసిని సుమారు 42.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
సమాజంలో నిరుద్యోగ సమస్య వల్ల యువత పక్కదారి పడుతుందని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏటీసీలను ఏర్పాటు చేశారని, యువతకు టీఎస్పీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తునే ఒక వైపు ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని తెలిపారు. యువత కష్టపడి చదవాలని, తద్వారా ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు.ఏ టి సి పక్కనే 20 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన న్యాక్ భవనంలో మహిళలకు పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. "మీ భవిష్యత్తు మీ కష్టంపైన ఆధారపడి ఉంది.
అందువల్ల నాలుగు సంవత్సరాలు బాగా కష్టపడి చదువుకుంటే 40 సంవత్సరాలు సుఖపడతారు" అని ఈ సందర్భంగా మంత్రి యువతకు తెలిపారు. నల్గొండ జిల్లా జల సంరక్షణలో జాతీయ అవార్డు సాధించడం పట్ల ఆయన జిల్లా కలెక్టర్. ఇలా త్రిపాఠీ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి పద్మ, ఏ టి సి ప్రిన్సిపల్ నరసింహ చారి,లైబ్రరీ చైర్మన్ ఆఫీజ్ ఖాన్ ,డిసిసి డైరెక్టర్ సంపత్ రెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, టిజిఐఐసి జోనల్ మేనేజర్ సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు .