01-10-2025 02:04:45 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000 ఉందని ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) సుదర్శన్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. నియోజకవర్గంలో ఉపఎన్నిక నిర్వహణకు 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
జూలై 1, 2025ను అర్హత తేదీగా తీసుకుని సవరించిన జాబితాలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఈ జాబితాలో 6,106 మంది యువ ఓటర్లు (18 నుంచి 19 సంవత్సరాలు), 2,613 మంది వృద్ధులు (80 ఏళ్లు పైబడిన వారు), అలాగే 1,891 మంది దివ్యాంగులు ఉన్నా రు.
వీరిలో 519 మంది చూపు కోల్పోయినవారు, 667 మంది కదలికల లోపం ఉన్నవారు, 311 మంది వినికిడి/మాట లోపం కలిగిన వారు, మిగతా 722 మంది ఇతర కేటగిరీలకు చెందినవారు, విదేశీ ఓటర్లు 95 మంది ఉన్నారని సీఈవో తెలిపారు. సెప్టెంబర్ 2న విడుదలైన ప్రాథమిక జాబితాలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. నిరంతర సవరణల తరువాత 6,976 మంది కొత్తగా చేర్చగా, 663 మందిని తొలగించగా. మొత్తం సంఖ్య 3,98,982కి చేరింద న్నారు. సేవా ఓటర్లను కలుపుకుని తుది సంఖ్య 3,99,000గా నమోదైందన్నారు.