29-10-2025 12:47:15 AM
-ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల ముందస్తు అనుమతి ఉత్తర్వులపై స్టే
-న్యాయస్థానం తీర్పుపై బీజేపీ నేతల హర్షం
-తదుపరి విచారణ వచ్చే నెల 17కు వాయిదా
కర్ణాటక, అక్టోబర్ 28: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వానికి మంగళవారం హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్ తదితర సంస్థల కార్యకలాపాలకు ముందస్తు అనుమతిని తప్పనిస రి చేస్తూ అక్కడి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నవంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.
ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లయిన నేపథ్యంలో భారీస్థాయిలో కవాతులు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో రాష్ట్రప్రభు త్వం ప్రైవేటు సంస్థలు, సంఘాలు తమ కార్యకలాపాల కోసం ప్రభుత్వ మైదానాలు, రహదారులు, బహిరంగ ప్రదేశాలు, విద్యాసంస్థల ప్రాంగణాలను వినియోగించుకోవా లంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేసిం ది. ఈ మేరకు అక్టోబర్ 18న కర్ణాటక ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల యంత్రాంగాలను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 19న తలపెట్టిన ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్లో ఆర్ఎస్ఎస్ ‘రూట్ మార్చ్’ నిర్వ హించాలని భావించింది. ఈ మేరకు తహసీల్దార్కు దరఖాస్తు చేసుకుంది. అయితే శాంతి భద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందం టూ తహసీల్దార్ అనుమతి నిరాకరించి ఆ దరఖాస్తును తిరస్కరించారు. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర వివాదం నెలకొంది.
రాష్ట్రంలో అర్ఎస్ఎస్ను నిషేధించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఓ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థల హక్కులను ఉల్లంఘిస్తుందని పిటిషన్లో ఆరోపించింది. దీనిపై విచారణ జరిగిన హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది. కాగా హైకోర్టు తీర్పును బీజేపీ నేతలు స్వాగతించారు.