11-08-2025 01:10:08 AM
హైదరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో అర్బయిన్ ప్రత్యేక పోస్టర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ర్ట ప్రతినిధి మీర్ ఫిరాసత్ అలీ బాఖ్రీ, సయ్యద్ రేహాన్ హైడర్, తహౌర్ అలీ జైది పాల్గొన్నారు. హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాలు న్యాయానికి సత్యాన్ని కాపాడే స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు.
మీర్ ఫిరాసత్ అలీ బాఖ్రీ మాట్లాడుతూ అర్బయిన్ అంటే ఆషూరా అనంతరం 40వ రోజు అని, పవిత్ర ప్రవక్త మహ్మద్ ముస్తఫా మనవడు ఇమామ్ హుస్సేన్ కర్బలాలో వీరమరణం పొందిన రోజును స్మరించుకోవడమని పేర్కొన్నారు. ఉమయ్యద్ ఖలీఫా యజీద్కు విధేయత చూపేందుకు ఇమామ్ హుస్సేన్ నిరాకరించటం శాశ్వతమైన సత్య, అసత్య పోరాటానికి ప్రతీకగా నిలిచిందని తెలిపారు. సభలో ఇమామ్ హుస్సేన్ త్యాగాలను న్యాయం, సత్యం, నైతిక ధైర్యానికి నిలువెత్తు సందేశంగా స్మరించారు.