17-08-2025 12:23:14 AM
నాగార్జునసాగర్,ఆగస్టు 16 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయంలోకి వరద 1,89,169 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,33,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 1,99,544 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ రిజర్వాయర్కు విడుదల చేస్తున్నారు.
దీంతో సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 587.50 అడుగుల వద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 305.4050 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో జలాశయం 20 క్రస్టు గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,56,760 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్ట్ అందాలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాట కులు తరలివస్తున్నారు. దీంతో సాగర్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. లాంచీ స్టేషన్ నుంచి జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు నాలుగు లాంచీ ట్రిప్పుల్లో పర్యాటకులు వెళ్తూ సందడి చేస్తున్నారు.
శ్రీశైలంకు భారీగా వరద
ఐదు గేట్లు పైకెత్తి దిగువకు నీటి విడుదల
నాగర్కర్నూల్(విజయక్రాంతి): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతుండటంతో శనివారం అధికారులు ఐదు గేట్లను 10 ఫీట్ల మేద పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి 1,10, 707 క్యూసెక్కుల నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో 1,33,720 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.