12-09-2025 12:20:53 AM
సంపూరన్ నాయక్కు చికిత్స
విజయవంతం కావాలని జగ్గారెడ్డి దంపతుల ఆకాంక్ష
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : కంటి చూపు పోయిన విద్యార్థి సంపూరన్ నాయక్కు తిరిగి చూపు వచ్చేందుకు చికిత్స కోసం అయ్యే ఖర్చుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దంపతులు రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. చికిత్స విజయవంతంగా పూర్తయి కంటి చూపుతో తిరిగి రావాలని జగ్గారెడ్డి ఆకాంక్షించారు.
కర్ణాటకకు చెందిన కిషన్ పవార్, శాంతాబాయి దంపతులు 15 సంవత్సరాల క్రితం సంగారెడ్డిలోని కందికి వచ్చి స్థిరపడ్డారని, వారి చిన్న కుమారుడు సంపూరన్ నాయక్ ఏడాది క్రితం బైక్ మీద నుంచి పడడంతో తలకు గాయాలు కావడంతో కంటి నుంచి బ్రెయిన్ కు వెళ్లే నరం వీక్ అవడం వల్ల చూపు కోల్పోయిందని జగ్గారెడ్డి తెలిపారు.
ఒక నెల రోజులు కోమాలోకి వెళ్లిన సంపూరన్ నాయక్కు ఆప్టిక్ హైడ్రోపి అనే వ్యాధికి చికిత్స కోసం ఇప్పటి వరకు ఆయన తల్లిదండ్రులు రూ. 5లక్షలు ఖర్చు పెట్టారని తెలిపారు. కంటి చూపు తిరిగి రావాలంటే ఇంకా రెండు ప్రధాన చికిత్సలు చేయాలని డాక్టర్లు సూచించారని, చికిత్స చేసేందుకు రూ. 8 లక్షల అవసరం అవుతాయని వివరిచారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఆక్యు పంక్చర్, స్టెమ్ సెల్ రిజనరేషన్ ఒకేసారి చేస్తే కంటి చూపు తిరిగి వస్తుందని డాక్టర్లు చెప్పారని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ కుమారుడికి చికిత్స చేయించలేక అవస్థ పడుతున్న విషయాన్ని తల్లిదండ్రులు తన వద్దకు వచ్చి ఆవేదనతో చెప్పారని జగ్గారెడ్డి వివరించారు. బీకాం చదువుతున్న సంపూరన్ దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయినట్లు, అతడికి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్సలు కోసం రూ. 10 లక్షలు జగ్గారెడ్డి అందజేశారు.