02-12-2025 01:16:01 AM
ఘటన స్థలంలోనే టీచర్ను సస్పెండ్ చేసిన డీఈవో
ఆదిలాబాద్, డిసెంబర్ ౧ (విజయక్రాంతి): విద్యార్థిని కించపరిచేలా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట విద్యార్థిని తల్లి తండ్రులు, కాలనీ వాసులు ఆందోళన చేపట్టడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ పట్టణంలోని రణదివే నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎం.డీ యూనుస్ పదవ తరగతి విద్యార్థినిని సామాజిక వర్గం పేరిట, కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడారని..
తెలుసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. తమ ను కించపరిచే విధంగా వ్యవహరించిన ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఇంచార్జ్ డీఈవో, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఎంఈవో సోమయ్య లు ఘటన పై విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్టు ఇన్చార్జి డీఈఓ రాజేశ్వర్ ప్రకటించడం తో కాలనీ వాసులు శాంతించారు. కాగా ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిందర్ వెల్లడించారు.