23-12-2025 12:00:00 AM
ప్రధానోపాధ్యాయులు మహేందర్ గౌడ్
ఆదర్శ పాఠశాలొ ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు
గాంధారి, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి అని ప్రధానోపాధ్యాయులు పి. మహేందర్ గౌడ్ అన్నారు. ఈ మేరకు సోమవారం రోజున గాంధారి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో భారతీయ మహానీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని గణిత దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గణిత ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పాల్గొని విద్యార్థులకు గణిత ప్రాముఖ్యతను వివరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. మహేందర్ గౌడ్ మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రానికి చేసిన అసమాన సేవలను స్మరించుకుంటూ, విద్యార్థులు గణితాన్ని భయపడకుండా ఆసక్తితో అధ్యయనం చేయాలని సూచించారు. గణితం మన దైనందిన జీవితంలో ఎంత అవసరమో వివరించారు. విద్యార్థిని విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ ను ఆదర్శంగా తీసుకొని గణిత శాస్త్రంలో ప్రావీణ్యం పొందాలని ఆయన సూచించారు.
రాబోయే పదో తరగతి పరీక్షల్లో పదవ తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించి,తల్లిదండ్రులకు, పాఠశాలకి,మండలానికి మంచి పేరు తీసుకోరావాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భాగంగా గణిత క్విజ్, పజిల్స్, నమూనా సమస్యల పరిష్కారం వంటి కార్యక్రమాలు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గణిత ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.