01-05-2025 07:04:20 PM
వాడ వాడల రెపరెపలు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): చికాగో అమరవీరుల పోరాట త్యాగాల పతాకం వాడవాడల రెపరెపలాడింది. మే డే అంతర్జాతీయ కార్మిక పోరాట దినోత్సవం పార్టీలు, రాజకీయాలు, యూనియన్ లకు అతీతంగా అట్టహాసంగా జరుపుకున్నారు. గనులు, డిపార్ట్మెంట్లు, కార్మిక, అసంఘటిత సంఘాల కార్యాలయాలపై ఎర్రజెండాలు రెపరెపలాడాయి. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు బెల్లంపల్లి భగత్ సింగ్ చౌరస్తాలో ఎర్రజెండా ఎగరవేసి చికాగో వీరులకు జోహార్లు చెప్పారు. సిపిఐ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యదర్శి ఆడెపు రాజమౌళి జెండా ఆవిష్కరణ చేశారు. భగత్ సింగ్ వద్ద సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్టపల్లి వెంకటస్వామి జెండా ఆవిష్కరణ చేసి మేడే వేడుకలను నిర్వహించారు.
ఏరియా హాస్పిటల్ వద్ద జెండా ఆవిష్కరణ చేసి మేడే దినోత్సవం జరిపారు. సిఐటీయూ, టిఎన్టియూసీ, సింగరేణి గని కార్మిక సంఘం, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు మేడే వేడుకలను ఘనంగా జరిపారు.కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లయ్య, టిపీసీసీ రాష్ట్ర ప్రచార కన్వీనర్ నాతరి స్వామి, టిఎన్టిసి నాయకులు మనీ రామ్ సింగ్, ఎస్ జి కే ఎస్ నాయకులు మహేందర్, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు నీరేటిరాజం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు కనుకుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.