15-12-2025 08:05:17 PM
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
ఎల్బీనగర్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ స్టూడెంట్ దుర్మరణం చెందగా, ఆమె తండ్రి తీవ్ర గాయాల పాలయ్యి చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ లో నివాసం ఉండే ఎంసాని పాండు కుమార్తె ఎంసాని ఐశ్వర్య(19) మహబూబ్ నగర్ లో ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం.. పాండు కూతురుతో కలిసి ఆర్టీసీ కాలనీ వద్ద బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటి బస్టాండుకు వెళ్తుండగా అతి వేగంతో వచ్చిన కారు ఢీ కొట్టింది.
ప్రమాదంలో తండ్రీకూతుళ్ళిద్దరికీ తీవ్ర గాయాలు కాగా.. స్పందించిన స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే ఐశ్వర్య మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన తండ్రి పాండును మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈ ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.