27-11-2024 12:00:00 AM
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అనేక ఉద్యమాల ఫలితంగా 2017లో 8,792 పోస్టులకు డీఎస్సీ(టీఆర్టీ) నోటిఫికేషన్ జారీ అయింది. మళ్ళీ ఆరేండ్లకు అభ్యర్థుల పోరాటాల ద్వారానే మరో నోటిఫికేషన్ 5,089 పోస్టులకు జారీ చేశారు. మొత్తం దాదాపు 15 వేల ఖాళీలు అప్పట్లో ఉన్నప్పటికీ కేవలం 5 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు.
సాధారణ ఎన్నికలు రావడం, పిమ్మట కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభ్యర్థులు ఒత్తిడి చేయగానే ఎన్నికల హామీ మేరకు పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. అనంతరం 11,062 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి త్వరితగతిన పూర్తి చేశారు. వాటిలో దాదాపు 600 పోస్టులు ఇంకా భర్తీ కాలేదు.
కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు జాయిన్ కాకపోవడంతో కొన్ని పోస్టులు మిగిలాయి. వాటి స్థానంలో మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి. ఇక, 33 జిల్లాల్లో డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన వారు, మొన్నటి డీఎస్సీలో జాబ్ కోల్పోయిన వారు మరో డీఎస్సీకి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఫిబ్రవరిలో మరో డీఎస్సీ ప్రకటించాలి.
టీచర్స్ ప్రమోషన్స్తో ఏర్పడిన ఖాళీలు, పదవీ విరమణ పొందిన వారి ఖాళీలు, రెగ్యులర్ ఖాళీలు కలిపి మొత్తం దాదాపు 15 వేల ఖాళీలు ఉన్నాయి. కానీ, ప్రభుత్వం 6 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొంది. కాలయాపన లేకుండా నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం టెట్ పరీక్షకి అభ్యర్థులు మరోసారి ప్రిపేర్ అవుతున్నారు. ఫలితాలు వచ్చిన వెంటనే డీఎస్సీపై చర్యలు వేగవంతంగా పూర్తి చేసి, నోటిఫికేషన్ జారీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
రావుల రామ్మోహన్రెడ్డి