17-11-2025 01:08:41 AM
-ఒకరికి త్రీవ గాయాలు
-డ్రైవర్ నిద్ర కారణం?
-వనపర్తి జిల్లాలో ఘటన
వనపర్తి, నవంబర్ 16 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ్మాస్వామి ఆలయంలో బంధువుల వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో వస్తుండగా మినీ వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి బ్రిడ్జి వద్ద జరిగింది.
పాన్గల్ మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన కావడి సుధాకర్ తమ కుటుంబ సభ్యులతో శనివారం యాదగిరిగుట్టలో జరిగిన వివాహానికి హాజరై, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మినీ వ్యాన్ లో ఇంటికి బయలుదేరారు. దారిలో నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని దేవుని తిరుమలాపురంలో వాహనంలో ఉన్న కొంత మంది బంధువులను దింపి, అక్కడే రాత్రి విశ్రాంతి తీసుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున మూడుగంటలకు చింతకుంటకు బయలుదేరారు. ఈ క్రమంలో పాన్గల్ మండలంలోని తెల్లరాళ్లపల్లి వంతెన సమీపానికి రాగానే వాహనం ఆకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. అందులో ఐదుగురు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు.
సాత్విక బాలిక అనే చిన్నారి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకొని జిల్లా కేంద్రంలోని ఏరియా దవఖానకు గాయపడిన వారిని తరలించారు. క్షణాల్లో ఇంటికి చేరుకుంటామన్న తరుణంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తున్నది.