31-07-2025 12:53:39 AM
శ్రీరంగాపురం మండలం జులై 30.మండలంలోని రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సందర్శించారు. వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు సాగునీరు అందించే భీమా కెనాల్ కు నీటిని విడుదల చేయడం లేదని రైతులు మంత్రి జూపల్లికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి రంగసముద్రం బ్యా లెన్సింగ్ రిజర్వాయర్ ను క్షేత్రస్థాయిలో పరిలిశీలించారు. నీటి విడుదలకు జాప్యం చేసిన సాగునీటి అధికారులపై మంత్రి జూపల్లి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నప్పటికి, సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని ఎందుకు విడుదల చేయలేదని నిలదీశారు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతమైతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేయాలని, రోజువారీగా ఎంత నీటిని విడుదల చేస్తున్నారో దాని లాగ్ బుక్ లో నమోదు చేయాలన్నారు. మంత్రి జూపల్లి వెంట ఎస్ఇ శ్రీనివాస్ రెడ్డి, ఇఇ కేశవ రావు, డీఇలు కిరణ్ కుమార్, రాజ్ కుమార్, ఏఇఇ వినయ్ కుమార్, ఏఇ అక్షయ్ కుమార్ తదితరులు ఉన్నారు.