05-05-2025 08:01:46 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సోమవారం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిండంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్ మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలంగాణలోని కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భూప్రకంపనలు వచ్చాయని భూకంప కేంద్రాధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు అయింది.
నిర్మల్ జిల్లాలోని కడెం, జన్నారం, ఖానాపూర్, లక్ష్మణ్ చాందా మండలాల్లో 2 నుంచి 5 సెకన్లపాటు , కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామడుగు మండలాల్లో రెండు సెకన్లపాటు స్వల్ప ప్రకంపనల ప్రభావం కనిపించిందని అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లి, మోర్తాడ్, సిరికొండ మండలాల్లో 3 నుంచి 4 సెకండ్ల ప్రకంపనలు వచ్చాయని, అలాగే పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ లో స్పల్పంగా ప్రకంపనలు రావడంతో జనాలు బయటకు పరుగులు తీశారు.