16-09-2025 05:39:15 PM
ఎదుళ్ల రిజర్వాయర్ వద్ద ఎఫ్ ఎస్ ఎల్ పెంచకుండా కిందికి ఉండేలా చూడాలి
రిజర్వాయర్ నుండి నీటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పై సర్వే చేయండి
మూసి నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల కోసం సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేయాలి
శివన్న గూడెం రిజర్వాయర్ పనుల సమీక్షలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు,(విజయకాంతి): శివన్న గూడెం రిజర్వాయర్ ని నిర్మిస్తున్నప్పటికీ ఆ రిజర్వాయర్ లోకి ఎక్కడి నుండి నీటిని తరలించాలని తల తోక తెలియకుండానే గత ప్రభుత్వం రిజర్వాయర్ పనులు మొదలు పెట్టిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మునుగోడు నియోజకవర్గం లోని మర్రిగూడ మండలం శివన్నగూడ రిజర్వాయర్ పనులపై సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం సభ్యులతో హైదరాబాదులోని తన నివాసంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
తాను చొరవ తీసుకొని సంబంధిత మంత్రి, నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారుల తో చర్చించి మహబూబ్నగర్ జిల్లాలోని ఎదుల్ల రిజర్వాయర్ నుండి శివన్నగూడ రిజర్వాయర్ కు నీటిని తరలించేలా 1800 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు తీసుకొచ్చామన్నారు. రిజర్వాయర్ పనులు 80 శాతం పూర్తయినప్పటికీ రిజర్వాయర్ కింద డిస్టిబ్యూషన్ నెట్వర్కు పనులు మొదలుకాలేదని వెంటనే రిజర్వాయర్ కింద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పై సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేయాలన్నారు.
ఎదుల్ల రిజర్వాయర్ నుండి శివన్నగూడెం రిజర్వాయర్కు నీటిని తరలించే పాయింట్ వద్ద ఎఫ్ ఎస్ ఎల్ పూర్తి సరఫరా స్థాయి 437.375 గా నిర్ధారించగా, అక్కడి ఇంజనీర్లు దానిని 440 ఎఫ్ ఎస్ ఎల్ గా ఉండాలని పట్టుబడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎట్టి పరిస్థితుల్లో 440 ఎఫ్ ఎస్ ఎల్ కి ఒప్పుకునేది లేదని, నిర్ణయించిన 437 ఎఫ్ఎస్ఎల్ నుండే నీటిని తరలించేలా చర్యలు తీసుకువాలని అధికారులను ఆదేశించారు.
నారాయణపురం, చౌటుప్పల్ , మల్కాపురం పారిశ్రామిక పార్క్ త్రాగునీటికి శాశ్వత పరిష్కారం చూపాలి
నియోజకవర్గంలోని నారాయణపూర్ చౌటుప్పల్ మండలం ప్రజల తాగునీటితో అవసరాలతో పాటు మల్కాపురంలో తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ ఏర్పాటుచేసిన పారిశ్రామిక పార్కు కూడా తాగునీటిని అందించేలా శాశ్వత పరిష్కారం కోసం ఇప్పటికే శివన్న గూడెం రిజర్వాయర్ నుండి తాగునీరు అందించడానికి సుమారు 1200 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు.ఆ పనుల పురోగతిపై చర్చించారు.
మూసి నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల కోసం సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేయాలి
వర్షాకాలంలో మూసీ నదిలోకి వృధాగా వెళుతున్న జలాలను ఒడిసిపట్టి వాటిని చౌటుప్పల్ మండల సాగునీటి అవసరాల కోసం వాడుకోవడానికి చిన్న మూసి నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల కోసం సర్వే చేసి డిపిఆర్ సిద్ధం చేయాలన్నారు. చిన్న మూసి వాగు నుండి మూసి నదిలోకి వృధాగా వెళ్తున్న వర్షపు నీరును లిఫ్ట్ చేసినట్లయితే చౌటుప్పల్ మండలం లోని కొన్ని గ్రామాలు సస్యశ్యామలమయ్యే అవకాశం ఉందని రిటైర్డ్ ఇంజనీర్లు ఫోరం సభ్యులు ఎమ్మెల్యే తెలపడంతో వెంటనే పనులు మొదలు పెట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.