17-09-2025 02:39:53 PM
హైదరాబాద్: నగరంలోని గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మేనిఫెస్టో ప్రకారం ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం భర్తీ చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్న డిమాండ్ మంచిదేనని.. నిరుద్యోగ యువత కష్టాల్లో ఉన్నారన్నారు. నిరుద్యోగ యువతకు దారి చూపించే బాధ్యత ప్రభుత్వానిదేనని.. గ్రూప్-1 అవకతవకలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కేసీఆర్(KCR)ను గద్దె దించడంలో యువత పాత్ర కీలకమని, నిరుద్యోగులకు అండగా ఉంటామని అమరవీరుల సాక్షిగా చెబుతున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
సిటీసెంట్రల్ లైబ్రరీ, అశోక్ నగర్ కు వస్తా.. మీ నిరసనలకు మద్దతిస్తా.. నిరుద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. తెలంగాణకు అన్యాయం జరగవద్దనే సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు. నేపాల్ తరహాలో యువత తిరగబడి మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమని.. నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం మనుగడ సాధించలేదని అన్నారు. నిరుద్యోగులను గాలికి వదిలేయొద్దు.. వారికి దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వచ్చి మాకు న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారని.. కానీ అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.