20-09-2025 06:00:11 PM
పెద్దపల్లి,(విజయక్రాంతి): రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ శనివారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పై ఎమ్మెల్యే ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రామగుండం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు పాలకుర్తి, అంతర్గం మండలాల అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, శాశ్వత అభివృద్ధి పనులు, విద్య, వైద్యం, రహదారులు, శుద్ధి జలాలు, పారిశుద్ధ్య సదుపాయాలు వంటి రంగాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ప్రత్యేకించి రాబోయే నెలల్లో చేపట్టవలసిన అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమగ్రంగా చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డు అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రహదారి మరమ్మతులు, కాలువల నిర్మాణం, పార్కులు, వీధి దీపాలు వంటి సదుపాయాలను వేగవంతంగా అమలు చేయాలని సూచించారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు.