30-01-2026 12:47:26 AM
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితమ్మ పోరుశంఖం!
మొయినాబాద్, జనవరి 29 (విజయ క్రాంతి): అధికారం కోసం అబద్ధాలు.. రెండేళ్లుగా ప్రజలకు కష్టాలు‘ - ఇదే కాంగ్రెస్ పాలన అని మాజీ హోం మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. మొయినాబాద్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగుతున్న తరుణంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ఆమె కాంగ్రెస్ సర్క్పా విమర్శనాస్త్రాలు సంధించారు.గురువారం మొయినాబాద్లోని స్టార్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రసంగం సంచలనంగా మారింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా సామాన్య ప్రజలకు జరిగిన మేలేమీ లేదని ఆమె విమర్శించారు. ‘ప్రజలు ఇప్పటికే వాస్తవాలను గ్రహించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు‘ అని హెచ్చరించారు.
తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందని, ఇంటింటికీ సంక్షేమ ఫలాలను అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆమె కొనియాడారు. ప్రజలు నేటికీ బీఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని ఆమె స్పష్టం చేశారు. వార్డుల వారీగా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని కోరారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని గుర్తు చేయాలని చెప్పారు. మొయినాబాద్ మున్సిపాలిటీని భారీ మెజారిటీతో కైవసం చేసుకోవాలన్నారు.‘వార్డు ఏదైనా.. ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ అభివృద్ధి వెంటే ఉంటుందని ఆ దిశగా కార్యకర్తలు ముందుకు వెళ్లాలని ఆమె దిశా నిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ జై సింహ, రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి, రవి యాదవ్, మండల మున్సిపల్ అధ్యక్షుడు దారెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.