19-08-2025 12:32:44 AM
ప్రజల సౌకర్యార్థం రెండు బ్రిడ్జిలు నిర్మిస్తాం
హేమ సముద్రం చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
హాన్వాడ: ఖర్చుకు ఏమాత్రం వినపడకుండా ఏర్పడిన గండిని పూడ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ నియోజకవర్గం, హన్వాడ మండలం, ఇబ్రహీంబాద్ లోని హేమ సముద్రం గండి పడిందని స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న హేమ సముద్రాన్ని ఇరిగేషన్ శాఖ అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖ మంత్రి తో మాట్లాడి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి హన్వాడ మండలంలోని అన్ని చెరువులను మరమత్తులు చేసి శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్పష్టం చేశారు. గండి పడిన విషయం తెలిసిన వెంటనే హేమ సముద్రం మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. రైతులు రెండు వందల ట్రాక్టర్ల మట్టిని పోసి గండిని పూడ్చారని ఆయన తెలిపారు. హేమ సముద్రం చెరువు ప్రతి సారి కురిసే భారీ వర్షాలకు ఇలా గండిపడుతూనే ఉందన్నారు.
అందుకే భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే భారీ వర్షాలకు హన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువులు సైతం తెగే ప్రమాదం ఉందన్నారు. వాటినన్నింటికి మరమ్మతులు చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. మైనర్ రిపేర్లు ఉంటే వెంటనే పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. చెరువు కట్ట వర్షాలకు దెబ్బతినకుండా ఉండేందుకు, అలుగుపారే వద్ద రెండు బిడ్జీలను నిర్మించేందుకు వెంటనే ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.