calender_icon.png 7 January, 2026 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎవరూ అధైర్యపడొద్దు

05-01-2026 01:47:39 AM

కంటి సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేయిస్తా

మునుగోడులో 11 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన  మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్‌రెడ్డి 

మునుగోడు, జనవరి 4 (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలో కూడా కంటి సమస్యతో బాధపడే వాళ్ళు ఉండవద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం 11 విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని  నియోజకవర్గ కేంద్రాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో   జ్యోతి ప్రజ్వలన చేసి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రారంభించి మాట్లాడారు. ఐదు కౌంటర్లలో కంటి పరీక్షల నిర్వహణ సరళిని  పరిశీలించి కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు నేనున్నానని భరోసా ఇచ్చారు.

నియోజకవర్గంలోని ప్రజలు ఏ ఒక్కరు కూడా కంటి సమస్యతో బాధపడొద్దని తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు. జనవరి 19, 2025 న మొదలైన ఈ ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణ నిర్విరామంగా నియోజకవర్గంలో కొనసాగుతోంది. మొదటి విడత రెండో విడత ఉచిత కంటి వైద్య శిబిరాలను  మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించగా, మూడవ ఉచిత కంటి వైద్య శిబిరం చండూరు మున్సిపాలిటీలో నాలుగవ కంటి వైద్య శిబిరం నాంపల్లి మండల కేంద్రంలో ఐదవ కంటి వైద్య శిబిరం మర్రిగూడ మండల కేంద్రంలో  ఆరవ ఉచిత కంటి వైద్య శిబిరం చండూరు మండలంలోని బంగారుగడ్డ గ్రామంలో, ఏడవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గట్టుపల్ మండల కేంద్రంలో, ఎనిమిదవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నారాయణపూర్ మండల కేంద్రంలో, తొమ్మిదవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చౌటుప్పల్ మున్సిపాలిటీలో, పదవ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చౌటుప్పల్ మండలం లక్కారంలో నిర్వహించారు.

10 ఉచిత కంటి వైద్య శిబిరాలలో 7506   మందికి  వైద్య పరీక్షలు నిర్వహించి 1490 మందికి కంటి ఆపరేషన్లు పూర్తి చేయించారు. అనంతరం కంటి పరీక్షలకు చేయిం చుకోవడానికి వచ్చినవారికి స్వయంగా భోజనం వడ్డించారు.కండ్లు చూయించుకోడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతి కూడా కల్పించారు. ఉచిత కంటి వైద్య శిబిరాలను  ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆసుపత్రి వారి  సౌజన్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్వహిస్తోంది... ఈ 11 వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి స్థానిక నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులు  గత వారం రోజులుగా గ్రామాలలో ప్రచారం చేస్తూ కంటి సమస్యతో బాధపడుతున్న వారిని గుర్తించి  ఉచిత వైద్య శిబిరానికి తీసుకువచ్చి  కంటి పరీక్షలు చేయించి ఆపరేషన్కు అర్హులు అయిన వారిని హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రికి పంపించడానికి  పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వైద్య శిబిరానికి వచ్చిన వృద్ధులు ఉన్నారు.