16-08-2025 04:57:35 PM
గ్రామ స్వరాజ్య స్థాపనకు తపించిన క్రుషీవలుడు
ప్రజాస్వామ్య ఫలాలను పేదలకు అందించిన మహనీయుడు వాజ్ పేయి
ప్రతిపక్షమంటే ప్రజల పక్షమని నిరూపించిన గొప్ప నేత
వాజ్ పేయి బాటలో నడుస్తూ భారత్ ను విశ్వగురు’గా తీర్చిదిద్దుతున్న మోదీ
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ (విజయక్రాంతి): ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేద వాడి వరకు తీసుకెళ్లాలనే శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలను తూచ తప్పకుండా అమలు చేసిన గొప్ప నాయకుడు, మానవతావాది, భరతమాత ముద్దుబిడ్డ వాజ్ పేయి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) కొనియాడారు. స్వార్ధ ప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రభుత్వ విధానాలను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలున్న ఈరోజుల్లో... అందుకు భిన్నంగా ప్రతిపక్షమంటే ప్రజల పక్షమని నిరూపిస్తూ దేశ ప్రయోజనాల విషయంలో రాజకీయాలను పక్కనపెట్టి పాలక పక్షానికి సహకరించిన చరిత్ర వాజ్ పేయిదేనని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి, భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా శనివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బీజేపీ నేతలతో కలిసి వాజ్ పేయి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత దేశ వైభవాన్ని, విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తున్నా. పదవుల కోసం ఎంతటికైనా దిగజారే వ్యక్తులు, పార్టీలున్న ఈరోజుల్లో. అందుకు భిన్నంగా నమ్మిన సిద్దాంతం కోసం, విలువల కోసం కేంద్ర మంత్రి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులనే త్రుణ ప్రాయంగా వదిలేసుకున్న మహా నాయకుడు అన్నా 2 ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీని అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వంలోకి తీసుకురావడంతోపాటు మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన నేత వాజ్ పేయి అని పేర్కొన్నారు. ‘తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వాజ్ పేయి ప్రభుత్వం పార్లమెంట్ బలనిరూపణలో ఏఐడీఎంకే అధినేత జయలలిత మద్దతు ఉపసంహరించుకోవడంతో ఒకే ఒక్క ఓటు తక్కువై ప్రభుత్వాన్ని కోల్పోయారు.
ఆనాడు ఇతర పార్టీల ఎంపీలు బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ... అంతకుముందు దేశాన్ని నడిపిన పాలకులు ఎంపీలను కొనుగోలు చేసి ఐదేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపి ప్రజాస్వామ్య విలువలకు పాతరేసిన దాఖలాలున్నప్పటికీ... నేను ప్రజల వద్దకే వెళతానే తప్ప ఇట్లాంటి నీతిమాలిన పనులు చేయబోనంటూ ఏకంగా అత్యున్నత ప్రధానమంత్రి పదవినే వదులుకుని తిరిగి ఎన్నికల్లోకి వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నిజాయితీపరుడు వాజ్ పేయి’’అని శ్లాఘించారు. ‘‘నిత్యం గాంధీ పేరు చెప్పుకుని రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఆయన ఆశయాలను, ఆలోచనలను తుంగలో తొక్కే పార్టీలున్న ఈ రోజుల్లో గాంధీజీ కలలు కన్న రామ రాజ్యం... గ్రామ స్వరాజ్య స్థాపన కోసం నిరంతరం పరితపించి అమలు చేసిన మహానీయుడు వాజ్ పేయి.
ఒకనాడు గ్రామాల నుండి పట్టణాలకు వెళ్లాలంటే రోడ్లు బాగోలేక నరక యాతన పడుతున్న ప్రజల బాధలను దూరం చేసేందుకు గ్రామీణ సడక్ యోజనతో దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు రోడ్లు వేసిన ఘనత వాజ్ పేయి గారిదే. స్వర్ణ చతుర్భుజీ పేరుతో 4 లేన్లు, 6 లేన్ల జాతీయ రహదారులను ఏర్పాటు చేసి ప్రజలకు రవాణా మార్గాలను సులభతరం చేసిన దూరద్రుష్టి కలిగిన నాయకుడు అన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ ను తెలివి తక్కువోళ్లు... పిరికివాళ్లని హేళన చేస్తున్న తరుణంలో ప్రపంచమే హడలెత్తేలా ప్రోక్రాన్ పరీక్షలు నిర్వహించి అణుబాంబును తయారు చేసి అగ్రదేశాలకు వణుకు పుట్టించిన ధీశాలి వాజ్ పేయి.’’అని కొనియాడారు.