20-07-2024 12:22:42 AM
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
డీఆర్డీఓ, డీపీఓల వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి సీతక్క
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): స్థానిక ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసినందున పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మరింత శ్రద్ధతో, బాధ్యతతో పని చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయి సిబ్బందికి సలహాలు, సూచనలివ్వాలన్నారు. సరిగా విధులు నిర్వర్తించని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
శాఖ కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్తో కలిసి మంత్రి సీతక్క డీఆర్డీఓ, డీపీఓలతో శుక్రవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో చేపట్టాల్సిన చర్యలు, గ్రామీణ ఉపాధి హమీ పనులు, వన మహోత్సవం అమలుపై మార్గనిర్దేశం చేసారు. సీతక్క మాట్లాడుతూ.. వర్షాకాలంలో అధికార యంత్రంగమంతా అప్రమత్తంగా ఉండాలని, తాగు నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని.. గ్రామాల్లో జ్వారాలు వస్తే.. వెంటనే ఇంటింటి ఫీవర్ సర్వేలు చేపట్టాలన్నారు. వైద్య సిబ్బందితో సమన్వయం చేసి మలేరియా, డెంగీ టెస్ట్ కిట్లను గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.