28-10-2025 07:44:14 PM
నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుపై ఓటువేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అలవికాని బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి 2 సంవత్సరాలు గడుస్తున్నా, హామీల అమలులో వైఫల్యం చెందారని మండిపడ్డారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి, అరాచకాలు, కుంభకోణాలు పెరిగిపోయాయని, మంత్రులకు ముఖ్యమంత్రికి కమీషన్లు, అవినీతి మీద ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమం పట్ల లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతూ, మోదీ నాయకత్వంలో ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఏర్పడిందని అన్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపిస్తే బీజేపీ తరపున మరో ప్రజా గొంతుకగా మాకు బలం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.