calender_icon.png 11 June, 2025 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలకు వ్యతిరేకం కాదు

08-05-2024 12:19:09 AM

ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ

మమ్మల్ని వ్యతిరేకులుగా మాపై ముద్ర వేస్తున్నారు

దీనినుంచి లబ్ధి    పొందాలని విపక్షాల ప్లాన్

ముస్లింలు నా నిజాయతీ అర్థం చేసుకున్నారు

విపక్షాల అబద్ధాలు బయటపడ్డాయి

ముస్లింలకు పూర్తి రిజర్వేషన్లు ఎలా ఇస్తారు?

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కుంటారా?

లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు

పాట్నా, మే 7: తాను ఇస్లాంకు, ముస్లింలకు వ్యతిరేకిని కాదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘అది మా విధానం కాదు. నెహ్రూ కాలం నుంచే వారు ఇలాంటి వాటిని ప్రచారం చేస్తున్నారు. ముస్లిం వ్యతిరేకులుగా మాపై ముద్ర వేసి, దాని నుంచి లబ్ధి పొందాలని వారు చూస్తున్నారు. మమ్మల్ని వారికి వ్యతిరేకులుగా చూపించి, కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. కానీ ట్రిపుల్ తలాఖ్ రద్దు చేసినప్పుడు ముస్లింలకు నా నిజాయతీ అర్థమైంది. ఆయుష్మాన్ కార్డులు, కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చినప్పుడు వారు అలాగే భావించారు. ఉజ్వల్ యోజన కింద గ్యాస్, మంచి నీటి కనెక్షన్ ఇచ్చాం. ఇళ్ల పథకం అమలు చేశాం. ముస్లింలు కూడా అన్ని ప్రభుత్వ పథకాలను అందుకుంటున్నారు. పథకాల పంపిణీలో నేను ఎవరిపైనా వివక్ష చూపించలేదని వారు అర్థం చేసుకున్నారు. విపక్షాల అబద్ధాలు బయటపడ్డాయి. అదే వారి బాధ. అందుకే తప్పుదోవ పట్టించేందుకు వారు రకరకాల అబద్ధాలు చెబుతూనే ఉంటారు’ అని మోదీ వివరించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ముస్లింలు, హిందువులకు మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ నిప్పుతో చెలగాటమాడుతోందని మోదీ దుయ్యబట్టారు. 

లాలూపై విమర్శల పర్వం

ఆర్జేడీ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. జంతువులకు పెట్టాల్సిన గడ్డిని తిన్న ఓ నేత అంటూ లాలూను సంబోధించారు. అలాంటి వ్యక్తి ముస్లిం రిజర్వేషన్ల గురించి మాట్లాడటం సిగ్గు చేటు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద్భంగా లాలూ ప్రసాద్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లపై ఇండియా కూటమి నిజస్వరూపం బయటపడిందని దుయ్యబట్టారు. ముస్లింలకు పూర్తి స్థాయి రిజర్వేషన్లు ఇస్తామని, లాలూ ప్రసాద్ అంటున్నారని, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను లాక్కొని ఇస్తారా అని ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ దీనిపై మౌనంగా ఉంది. కానీ ఆ పార్టీ కూటమి నేతలు మాత్రం స్పష్టంగా చెబుతున్నారు. దాణా కుంభకోణం కేసులో జైలుకు పోయిన ఓ  వ్యక్తిని కోర్టు శిక్షించింది కూడా. చూడండి ఆయన సిగ్గులేని తనం. అనారోగ్య కారణాలతో బెయిల్‌పై బయట ఉన్నారు. మీ ఊర్లో ఎవరైనా జైలుకు వెళ్తే ఏం చేస్తారు? అందరూ దూరంగా ఆ వ్యక్తిని దూరంగా ఉంచుతారు. కానీ కాంగ్రెస్ చూడండి అలాంటి వారితో అంటకాగుతోంది’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.