08-08-2025 12:19:42 AM
ఖమ్మం, ఆగస్ట్ 7 (విజయ క్రాంతి): ఖమ్మం నగరం రోజు రోజుకు విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మీద ఖమ్మం మేయర్, కమిషనర్ దృష్టి సారించాలని సిపిఎం పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మం సుందరయ్య భవన్ లో పార్టీ టూ టౌన్ కమిటీ సమావేశం మాజీ కౌన్సిలర్ నర్రా రమేష్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా రోడ్ లు విస్తరణ పేరుతో పనులు ప్రారంభించి వదిలేయడం వల్ల నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అని విమర్శించారు. పాత మున్సిపాలిటీ నుంచి రిక్కా బజార్ మీదుగా చర్చి కాంపౌండ్ వరుకు రహదారి విస్తరణ ప్రారంభించి కొన్ని నెలలు అవుతున్నా రోడ్ పని పూర్తి చేయకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు.
రఘునాథ పాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఇల్లందు రోడ్ పనులు గత సంవత్సరం నుంచి రహదారి పనులు పూర్తి చేయకపోవడంతో చిన్న వర్షాలకు రోడ్ పాడు అవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు అని ఆరోపించారు. అల్లిపురం - కొత్తగూడెం రోడ్, రైల్వే స్టేషన్ రోడ్ ఇలా ప్రధానమైన రహదారులు పనులు నత్తనడకన సాగుతున్నాయి అని తెలిపారు. పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, భద్రం, డి వీరబాబు, మచ్చా సూర్యం, బి.రవీంద్ర, హుస్సేన్, ఎన్ కుమారి , ఏటా రాజేష్, మల్లికార్జున్ రెడ్డి, ఫకీరు సాహిబ్ తదితరులు పాల్గొన్నారు