calender_icon.png 29 May, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉల్లి.. ధరాఘాతం!

28-05-2025 01:17:56 AM

  1. భారీగా తగ్గిన ఉల్లి ధరలు బహిరంగ మార్కెట్లో క్వింటాలు రూ.1000లోపే 
  2. ఆరుగాలం శ్రమించిన రైతుకు వచ్చేది రూ.600 మాత్రమే 
  3. సాగు విస్తీర్ణం, పంట దిగుబడి పెరగడమే కారణం 

సంగారెడ్డి, మే 28(విజయక్రాంతి): ఉల్లి ధరలు రైతులకు కన్నీరు తెప్పిస్తు న్నాయి..ఒక్కసారిగా ఉల్లి ధరలు మరింత పతనమయ్యాయి. ఏకంగా క్వింటాలు రూ.1000కి పడిపోయింది. 60 కిలోల బ్యాగును రూ.500 నుంచి రూ.550 వరకు విక్రయిస్తున్నారు. రెండు నెలల క్రితం కిలో రూ.40 నుంచి రూ.60 వరకు ధర పలికిన ఉల్లి నేడు రూ.10లకు పడిపోయింది. గతంలో వినియోగదారులకు కన్నీళ్లు తెప్పించిన ఉల్లి..

నేడు రైతును నష్టాల్లో ముంచేసింది. పంట వేసే సమయంలో ధరలు బాగుండటంతో ఎక్కువ మంది సాగు చేశారు. కానీ దిగుబడి వచ్చే నాటికి ధరలు పూర్తిగా పతనమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మాత్రం లాభపడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

 పెట్టుబడి కూడా రాని పరిస్థితి...

ఉల్లి సాగుకు నీటి వసతి తప్పనిసరి.. పంట కాలం ఆరు నెలలు.. ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఖర్చు వస్తుంది.. రవాణా ఖర్చులు అదనం. ఎకరాకు 80 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం రూ.80 వేలకు మించి రాదు.. ఇలా చూసుకున్నా రైతుకు పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఈ సారి ఉల్లి దిగుబడి బాగానే వచ్చిందని..

పంట చేతికొచ్చే సమయానికి ధరలు పూర్తిగా పడి పోయాయని,పెట్టుబడి కూడా రాదని రైతులు లబోదిబోమంటున్నారు. రెండు నెలల క్రితం క్వింటాలు ధర రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు ఉండేది. చిల్లరగా కిలో రూ.50 నుంచి 60 వరకు విక్రయించేవారని తెలిపారు. ప్రస్తుతం ఆశించిన ధరలు లేకపోవడంతో నష్టాలు చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దళారులకే లాభాలు...

ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు నష్టాలు తప్పడం లేదు. పంట దిగుబడి వస్తే ధరలు లేకపోవడం.. సాగు చేయని సమయంలో విపరీతమైన ధరలు ఉండటం అన్నదాతలను కలవర పెడుతోంది. వీటికి తోడు ప్రకతి వైపరీత్యాలు వెంటాడుతూనే ఉంటాయి. పంట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాల కార ణంగా రైతులు నష్టాలు చవిచూడటం సాధారణంగా మారిపోయింది.

ప్రభుత్వాలు ప్రకటించే మద్దతు ధర ఏ మాత్రం సరిపోదని రైతులు అంటున్నారు. పంట దిగుబడి బాగా వచ్చినా.. దెబ్బ తిన్నా రైతులకు మాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా దళారులు మాత్రం లాభపడుతున్నారు.. బహిరంగ మార్కెట్లో ధరలు లేవంటూ తక్కువకే పంట దిగుబడిని కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ ధరలకు విక్రయించి లాభాలు పొందుతున్నారు.

ప్రతి సీజన్‌లలో  ఇదే పరిస్థితి పునరావతం అవుతోంది. ఇలావుండగా మెదక్ జిల్లాలో 600-700 ఎకరాలలో ఉల్లి సాగు చేస్తున్నారు. ఎకరాకు సాదారణంగా 10-12 టన్నుల దిగుబడి వస్తోంది. రబీ కంటే ఖరీఫ్‌లో ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. అలాగే సంగారెడ్డిలో నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోనే ఉల్లిసాగు ఎక్కువగా సాగవుతుంది. 

పట్టించుకోని ప్రభుత్వాలు...

ధరలు పెరిగిన ప్రతిసారీ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నాయి. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం లేదు. ధరలు పెరిగినప్పుడు వినియోగదారులు.. పతనమైనప్పుడు రైతులు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం వరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు రాయితీపై విత్తనాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఆ తర్వాత మిన్నకుండిపోయాయి.