02-09-2025 12:50:46 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ రోడ్లను గుంతల రహితంగా మార్చే లక్ష్యంతో జీహెచ్ఎంసీ చేపట్టిన ‘రోడ్ సేఫ్టీ డ్రైవ్’ యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈ డ్రైవ్ను నిరంతరం పర్యవేక్షిస్తూ, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశిస్తున్నారు. సోమవారం నాటికి నగరవ్యాప్తంగా 10,962 గుంతల ను పూడ్చివేసినట్లు అధికారులు వెల్లడించారు.
సోమవారం ఒక్కరోజే కృష్ణా నగర్, నాంపల్లి, బంజారాహిల్స్, ఎర్రమంజిల్, జూబ్లీహిల్స్, లకిడికాపూల్, మచ్చ బొల్లారం వంటి పలు కీలక ప్రాంతాల్లో గుంతల పూడ్చివేత, క్యాపిట్ల మరమ్మతులు, కొత్త సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను ఏకకాలంలో చేపట్టారు. జీహెఎంసీ ఇంజనీరింగ్ విభాగం ఇప్పటివరకు నగరంలో 13,616 గుంతలను గుర్తించగా, వాటిలో 80 శాతానికి పైగా, అంటే 10,962 గుంతలను ఇప్పటికే పూడ్చివేసింది. సోమవారం ఒక్కరోజే 108 గుంతలకు మరమ్మతులు పూర్తి చేశారు. ఇప్పటివరకు 544 క్యాపిట్లకు మరమ్మతులు చేయగా, 311 మ్యాన్హోల్ కవర్లను మార్చారు.