04-10-2025 01:14:28 AM
-కార్పొరేట్కు దీటుగా రెండువేల పడకలతో ఆస్పత్రి నిర్మాణం
-గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల స్థలంలో ఏర్పాటు
-ఎంఈఐఎల్ డైరెక్టర్ గోవర్ధన్రెడ్డి
-నూతన భవననిర్మాణ పనులను ప్రారంభించిన సంస్థ డైరెక్టర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం గోషామహల్ స్టేడియంలో ఆస్పత్రి నూతన నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఎంఈఐఎల్ సంస్థ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.
ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్దేశించిన రెండేళ్ల గడువులోగా నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త భవనాలను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా, అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ నూతన ప్రాజెక్టు కోసం గోషామహల్ స్టేడియంలో 26 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
నిజాం కాలంలో నిర్మించిన పాత ఉస్మానియా ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో, కొత్త భవనం కోసం డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 31న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు పనులు ప్రారంభం కావడంతోనగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.