28-07-2025 12:12:33 AM
మూడు నెలల నుంచి జీతాల్లేవ్.. మున్సిపల్ సిబ్బంది అవస్థలు
జీతాలు చెల్లించండి.. కార్మికుల ఆవేదన
నాగార్జునసాగర్, జులై 27: నందికొండ మున్సిపాలిటీలోని మూడు నెలల నుంచి మున్సి పాలిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. గత మూడు నెలల నుంచి నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే మున్సిపాలిటీ సిబ్బందికి ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడంతో తాము ఏ విధంగా జీవించాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
నడుం వంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రోజు పనులు చేస్తున్నామని, ప్రభుత్వానికి తమ జీతాల గురించి పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాధుడే దిక్కులేకుండా పోయాడన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తాము ఏండ్ల నుంచి పనిచేస్తున్నా పర్మినెంట్ చేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తమకు పెండింగ్ ఉన్న 3 నెలల జీతాలను వెంటనే ఇవ్వాలని మున్సిపాలిటీ సిబ్బంది కోరుతున్నారు.