28-09-2025 11:19:00 PM
చర్లపల్లి జైలుకు తరలింపు..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి లక్షలు దండుకొని మోసం చేసిన జవాడే కృష్ణ అనే వ్యక్తిని అరెస్టు చేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ ఎం. ప్రసాద్ తెలిపారు. నిందితుడు ఎలాంటి అనుమతులు లేకుండా ఎస్. కే డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులను అదిలాబాద్, ఉట్నూర్ లలో తెరిచి అందులో ఉద్యోగాలు ఇస్తానని సుమారుగా 300 పైగా నిరుద్యోగుల ఒక్కొక్కరి నుండి రూ. 20,000, ఇతర ఉద్యోగాల పేరిట డబ్బులు వసూలు చేసుకుని, వారికి ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేయగా అతనిపై ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలో 25 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. ఇతనిపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేయగా, నిందితునికి పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందించి, చర్లపల్లి జైలుకు తరలించమన్నారు. ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.