ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలి..
జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై.శేఖర్ రెడ్డి..
మునుగోడు (విజయక్రాంతి): పారిశుద్ధ్యంలో భాగంగా ఇంటింటికి ఇంకుడు గుంతలు, ప్రభుత్వ కార్యాలయాలలో, పాఠశాలలో సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించుటకు ఉపాధి హామీ నందు ప్రయోజనం ఉన్నదని గ్రామాలలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వై శేఖర్ రెడ్డి(District Rural Development Officer Sekhar Reddy) అన్నారు. మంగళవారం జన్మస్థాన్ పల్లి గ్రామంలో నర్సరీలో పిడి శేఖర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లతో ఏర్పాటుచేసిన రివ్యూ మీటింగ్(Review meeting)లో ఆయన హాజరై మాట్లాడారు.
మొక్కల పెంపకం, నర్సరీ నిర్వహణపై అవగాహన కల్పించారు. నర్సరీలలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం వంద శాతం సర్వైవల్ ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. మొక్కల పెంపకంలో అలసత్వం వహించరాదన్నారు. అలాగే పెన్షన్స్, స్వచ్ఛభారత్ మిషన్, ఉపాధి హామీ పనులపై సమీక్ష నిర్వహించారు.పెన్షన్లకు సంబంధించి వేలి ముద్రలు పడని వారికి మాత్రమే పంచాయతీ కార్యదర్శులు పెన్షన్ అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయభాస్కర్, ఎంపీఓ స్వరూప రాణి, ఇన్చార్జి ఏపీఓ నాగరాజు ఉన్నారు.






