19-08-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, ఆగస్టు 18 (విజయ క్రాంతి): నిజాంపేట్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ విభాగం గాడి తప్పుతుంది. తీసుకున్న అనుమతులకు విరుద్ధంగా అనుమతులు లేకుండా ఎడా పెడా అక్రమ అంతస్తులు నిర్మిస్తూ మున్సిపల్ చట్టాలను తుంగ లో తొక్కుతున్నారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలు రోజుకో చోట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుచున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు.
కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలపై, చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న బిల్డర్స్ పై చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం మొద్దు నిద్రలో ఉంటూ అధికారిక విధులకు మంగళం పాడడం పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. కార్పొరేషన్ లో మున్సిపల్ కమిషనర్ పోస్ట్,టౌన్ ప్లానింగ్ ఏసీపీ, టీపీఎస్ పోస్టులు అలంకార ప్రాయంగానే ఉంటూ చూసి మురువ చెప్పుక ఏడ్వ అనే సామేతకు అద్దం పడుతున్నాయి.
అక్రమ నిర్మాణాలపై పౌరులు, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్ లు పలు మార్లు ఫిర్యాదులు చేసినా మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వాటిని పరిశీలించి చర్యలు తీసుకోకపోగా చెత్తబుట్టలో వేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రగతినగర్ జీపీఆర్ లే అవుట్లో విచ్చల విడిగా అక్రమ నిర్మాణాలు...
నిజాంపేట్ కార్పొరేషన్ లోని 2వ డివిజన్ ప్రగతి నగర్ జీపీఆర్ లే అవుట్లో అనధికారిక నిర్మాణాలు పెట్రేగిపోతున్నాయి. అడ్డు అదుపు లేకుండా ఎవ్వరికీ తోచిన తీరుతో వారు బిల్డింగ్స్ నిర్మించడం పట్టణ ప్లానింగ్ కు విఘాతం కల్పిస్తుంది.బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం జీ+2, జీ +3 అనుమతులు తీసుకోని ఆపై ఇల్లీగల్ గా అదనంగా మరో రెండు మూడు అక్రమ అంతస్తులు నిర్మించడం ఇక్కడ సర్వ సాధారణంగా మారింది.
అదేవిధంగా ఈ కాలనీలో రెసిడెంట్స్ అనుమతు లు పొంది ధర్జాగా కమర్షియల్ భవంతులు నిర్మిస్తూ భారీగా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమ నిర్మాణాలపై జవాబుదారి వ్యవస్థ కానీ,అధికారుల తనిఖీలు కానీ లేకపోవడంతో బిల్డర్స్ బరితెగిం చి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తూ మున్సిపల్ చట్టాలకు సవాల్ విసురుతున్నారు.
ఇంత జరుగుతున్నా అధికారులు ఉలుకు పలుకు లేకుండా మున్సిపల్ కార్యాలయంలో ఏసీ గదులలో కూర్చుండి పోవడం పలు విమర్శలకు ఆజ్యం పోస్తుంది. నిజాంపేట్ కార్పొరే షన్ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
నోటీసులు ఇస్తారు... చర్యలు తీసుకోరు
అక్రమ నిర్మాణాలపై టీపీఎస్ సరితని వివరణ కోరగా.. నోటీసులు ఇచ్చాము, నోటీసు సమయం గడిచిన అనంతరం చర్య లు తీసుకుంటామని తెలిపారు. కానీ నోటీసుల సమయం గడిచి రోజులు గడుస్తున్న కూడా చర్యలు మాత్రం తీసుకోకపోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు.