08-07-2025 08:16:36 PM
- జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో వన మహోత్సవం
- విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేసిన జీహెచ్ఎంసీ స్వచ్ఛ భారత్ పీడీ యశశ్రీ
ఎల్బీనగర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని జాగృతి అభ్యుదయ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భావన శ్రీనివాస్, జీహెచ్ఎంసీ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్టు(GHMC Swachh Bharat Mission Project) ఆఫీసర్ యశశ్రీ అన్నారు. జాగృతి అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో కొత్తపేటలోని లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ లో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కొత్తపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్కూల్ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. జీహెచ్ఎంసీ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ యశశ్రీ మాట్లాడుతూ... మనం పీల్చే ప్రాణవాయువు కొరత రాకుండా ఉండాలంటే చెట్లను పెంచడం ఒక్కటే మార్గమని అన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవని తెలిపారు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేసి తిరిగి వాడుకునే వస్తువులను మాత్రమే వినియోగించాలన్నారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఇస్మాయిల్ గురూజీ, జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు గోపాల్ దాస్, రాము, జీవనది ఫౌండేషన్ ప్రతినిధి లక్ష్మీదుర్గ, లోటస్ ల్యాప్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ స్వప్న, టీచర్లు అనిత, శోభన్ బాబు, స్వచ్ఛ భారత్ టీం మెంబర్ జయశ్రీ, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.