29-10-2025 10:03:49 PM
కండువా కప్పి ఆహ్వానించిన గంట రవికుమార్..
వరంగల్ (విజయక్రాంతి): గత లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన పోగుల అశోక్ బుధవారం శివనగర్ లోని పార్టీ కార్యక్రమంలో బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యాపారులు ఐత వినోద్ కుమార్, చింతం పురుషోత్తం కూడా బీజేపీలో చేరారు. బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలేపాక మార్టిన్ లూథర్ ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. దేశంలో బీజేపీ చేపడుతున్న అభి వృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని గంట పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా స్థానిక ఎన్నికల్లో బీజేపీ అధిక సీట్లను గెలుచుకో వడం ఖాయమని గంట స్పష్టం చేశారు.
పార్టీలో చేరిన పోగుల అశోక్ మాట్లాడుతూ బీజేపీ చొరవతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని, మిగతా పార్టీలు ఓట్ల కోసం హామీలు ఇచ్చి ఎస్సీలను మోసం చేశాయని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. వాటి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతోందని తెలిపారు. జిల్లాలో పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యలపై జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ చేస్తున్న పోరాటానికి ఆకర్షితుడినైనట్టు స్పష్టం చేశారు. ఆయన ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాసి రాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఏనమాముల మండల అధ్యక్షులు బుద్దే శ్రీనివాస్, జిల్లా నాయకులు వడ్డమానుకోట తిరుపతి, బొడ్డు రాకేష్, తమ్మిశెట్టి క్రాంతి కుమార్, కొత్తకొండ రాజు, శ్రవణ్ మరియు నాయకులు పాల్గొన్నారు.