03-11-2025 07:36:22 PM
మద్దెపురం రాజు సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు
గుండాల,(విజయక్రాంతి): గుండాల మండలంలోని రోడ్లు నరకానికి రహదారుల్లగా కనిపిస్తున్నాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దె పురం రాజు పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మత్తు పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుండాల నుండి నూనెగూడెం మీదుగా సీతారాంపురం రోడ్డు వరకు వెళ్లే ప్రధాన రహదారితో పాటుగా రామారం నుండి వెల్మజాల, గుండాల గంగాపురం, తుర్కల షాపురం మోత్కూరు రోడ్లు గుంతల మయంగా మారి రాత్రిపూట, వర్షం పడ్డ సమయంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు.గుండాల మండలంలోని గుంతల మయంగా మారిన రోడ్లపై గుంతలను పూడ్చి ప్రజలను ప్రమాదాల నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.