15-09-2025 06:04:36 PM
పత్రం అందజేసిన ధరణి కాలనీ అసోసియేషన్ సభ్యులు
మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెండవ డివిజన్ ధరణి కాలనీ అసోసియేషన్ సభ్యులు, నివాసితులు తమ కాలనీలోని సమస్యల పరిష్కారం కోసం కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు మంచాల ప్రకాష్ మాట్లాడుతూ తమ కాలనీని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదని, ప్రజావాణిలో వినతిపత్రాలు ఇచ్చిన సమస్యలు పరిష్కారం కాలేదని, ఒక్క సీసీ రోడ్డు వేయ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ అధ్యక్షులు దుండిగల పురుషోత్తం మాట్లాడుతూ... కాలనీలో గుంతల మయమైన రోడ్ల కారణంగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బస్సులు రాని పరిస్థితి ఏర్పడిందని, వర్షాకాలం రాగానే కాలనీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుండి గృహ పన్నుల రూపంలో, ఇప్పటి వరకు దాదాపు 20కోట్ల రూపాయల వరకు వసూలు చేసినా అభివృద్ధి పనులు ఏమి చేయలేదు అని ఆరోపించారు.కాలనీ సమస్యలు వెంటనే పరిష్కరించి, అవసరమైన రోడ్లు, డ్రైనేజీ, వీధి వెలుగులు ఏర్పాటు చేయాలని కోరుతూ కాలనీ వాసులు కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు.