08-07-2025 05:40:28 PM
ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా విద్యాశాఖ, దిశా ఫౌండేషన్ & ఈఎల్ఎఫ్ ఇంగ్లీష్ వారి సౌజన్యంతో జిల్లాలోని 54 ప్రాథమిక పాఠశాలల్లో లర్న్ టు రీడ్ 90 రోజుల విద్యా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్(District Collector Divakara T.S) అన్నారు.
ఉపాధ్యాయులకు శిక్షణ, అదనపు మెటీరియల్
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక స్థాయి పాఠశాలల విద్యార్థులలో ఇంగ్లీష్ పై ప్రత్యేక శిక్షణ దిశా ఫౌండేషన్ & ఈఎల్ఎఫ్ ఇంగ్లీష్ వారి సహకారంతో ముందుగా జిల్లా స్థాయిలో 54 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి ఈ పాఠశాలల్లో బోధించే 108 మంది టీచర్స్ కు ప్రత్యేక శిక్షణను ఇప్పించి, ప్రాథమిక స్థాయి విద్యార్థులు సులువుగా ఆసక్తిగా ఇంగ్లీష్ నేర్చుకునేందుకు అనేక బోధనోపకరణాలను పోస్టర్స్, ఫ్లాష్ కార్డ్స్, డిజిటల్ పాటలు, రైమ్స్ ను డిజిటల్ రూపంలో పెన్ డ్రైవ్ నందు పొందు పరిచి అందజేయడం జరిగింది.
అలాగే ప్రతి విద్యార్థికి సులువుగా అభ్యాసం చేసే విధంగా వర్క్ బుక్స్ అందిస్తూ,విద్యార్థులకు కావలసిన అదనపు మెటీరియల్స్ అందజేసి 108 మంది టీచర్స్ తో దిశా ఫౌండేషన్,జిల్లా పాలన యంత్రాంగం మరియు జిల్లా విద్యాశాఖ ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి దాని ద్వారా టీచర్స్ ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహించి వారి యొక్క ప్రగతిని అంచనా వేస్తూ 90 రోజులపాటు ఈ ప్రత్యేక బోధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
దీని ద్వారా ఎంపిక చేసినటువంటి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఆటపాటలతో ఇంగ్లీషులో బోధిస్తూ, విద్యార్థులకు బోధనోపకరణ సామాగ్రి అందజేయడం ద్వారా ఆహ్లాదకరమైన స్వేచ్ఛాయుత వాతావరణంలో అనుభవం ద్వారా విద్యను అందించడం జరిగింది. దీని ఫలితంగా విద్యార్థులు ఆటపాటలతో ఇంగ్లీషు పై మక్కువ పెంచుకొని ఆశించిన అభ్యసన సామర్ధ్యాలను మెరుగుపరచుకోవడం జరిగింది. తధానుగుణంగా దిశా కార్యక్రమం అమలు చేయబడుతున్నటువంటి పాఠశాలల్లో విద్యార్థులు ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడే విధంగా శిక్షణను ఇవ్వడం జరిగింది.
దిశ కార్యక్రమం సాధించిన ప్రగతి
ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక స్థాయి పిల్లల్లో 50% విద్యార్థుల్లో అక్షరాలను గుర్తించడం, 20 శాతం విద్యార్థులు మూడు అక్షరాలు ఉన్న పదాలను చదవడం రాయడం,45 శాతం విద్యార్థులు వాక్యాల రూపంలో ఉన్న వాటిని చదవడం రాయడం ద్వారా ప్రగతిని సాధించారు.