04-07-2025 12:00:00 AM
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు ‘రామాయణ’. నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజీ సంయుక్తంగా, యాష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్తో కలిసి నిర్మిస్తున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా, సన్నీ డియోల్ హనుమంతు డిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్న ఈ ప్రాజెక్టుకు తొలిసారి ఆస్కార్ అవార్డు విజేతలు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
హాలీవుడ్లో అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్లు టెర్రీ నోట రీ, గై నోరిస్ యుద్ధ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్లు రవి బన్సాల్, రాంసే ఏవరీ కలిసి పనిచేస్తున్నారు. మొత్తం రెండు భాగాల్లో రూపుది ద్దుకుంటున్న ఈ సినిమా పార్ట్-1 2026 దీపావళికి, రెండోభాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా గ్లింప్స్ ప్రదర్శన
మేకర్స్ గురువారం ‘రామాయణ: ది ఇంట్రడక్షన్’ పేరిట ఈ మూవీ గ్లింప్స్ గ్లోబల్గా ప్రదర్శించారు. భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ఫ్యాన్ స్క్రీనింగ్స్ ద్వారా, న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భారీ బిల్బోర్డ్ టేకోవర్ ద్వారా వరల్డ్ వైడ్గా జరిగింది. ఇందులో భాగంగా మీడియా కోసం హైదరాబాద్లో గ్లింప్స్ను ప్రత్యేకంగా ప్రీమియర్ చేశారు. త్రీడీ వెర్షన్లో రూపొందించిన ఈ వీడియో సరికొత్త అనుభూతిని పంచింది.
ఇది మన సంస్కృతికి ఆత్మవంటిది: నితేశ్ తివారీ
గ్లింప్స్ ఆవిష్కరణ సందర్భంగా దర్శకుడు నితేశ్ తివారీ మాట్లాడు తూ.. “రామాయణం అందరం చిన్ననాటి నుంచి ఎదిగి విన్న, చూసిన కథ. ఇది మన సంస్కృతికి ఆత్మవంటిది. ఆ ఆత్మను గౌరవించడమే మా లక్ష్యం. అదే సమయంలో ఈ కథకు అర్హమైన సినిమాటిక్ స్థాయిలో ప్రజెంట్ చేయాలనుకున్నాం. ఒక దర్శకుడిగా, ఇది నా కోసం ఒక భారీ బాధ్యత మాత్రమే కాదు. ఓ గౌరవప్రదమైన అవకాశం కూడా” అన్నారు.
సాంస్కృతిక ఉద్యమం: నమిత్ మల్హోత్రా
“ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికీ సంబంధించిన ఒక సాంస్కృతిక ఉద్యమం. రామాయణం ద్వారా కేవలం చరిత్రను తిరిగి చెబుతున్నట్లు కాదు. మన వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తు న్నాం. ప్రపంచ స్థాయి ప్రతిభను ఒకచోట కలిపి ఈ కథను నిజమైన భావోద్వేగంతో, నూతన సినిమాటిక్ టెక్నాలజీతో చెప్పగలగడం సాధ్యమవుతోంది.
ఇంతకుముందు రామాయణాన్ని ఎన్నోసార్లు చూశాం. కానీ ఈ వెర్షన్లో దాని దృశ్యాలు, యుద్ధాలు అన్నీ నిజమైన వైభవం, విస్తృతితో రీఇమేజిన్ చేయబడుతున్నాయి. భారతీయులైన మనకు ఇది నిజం. ఇప్పుడు ఇది ప్రపంచానికి మనం ఇచ్చే బహుమతి” అని నమిత్ మల్హోత్రా అన్నారు.