27-07-2025 12:00:00 AM
-కిమ్స్ -సన్షైన్ హాస్పిటల్ వైద్యుల విజయం
- దక్షిణ భారతదేశంలోనే తొలి సర్జరీ:- డాక్టర్ బి చంద్రశేఖర్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో దక్షిణాఫ్రికాకు చెందిన 27 సంవత్సరాల యువకుడికి డోనర్ ఎముక గ్రాఫ్టును ఉపయోగించి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో ఈ అధునాతన భుజం మార్పిడి శస్త్రచికిత్స మొట్టమొదటిది. ప్రమాదంలో రోగి భుజం పైభాగపు చేతి ఎముక (ప్రాక్సిమల్ హ్యూమరస్) విరిగిపోయింది. భుజం కలప లేని పరిస్థితి ఏర్పడింది.
ఇటువంటి కేసులు ముఖ్యంగా యువ రోగులలో చికిత్స చేయడం చాలా క్లిష్టమైనది. సమగ్రంగా పరిశీలించిన అనంతరం షోల్డర్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ బి చంద్రశేఖర్ నాయకత్వంలోని నిపుణులైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స వైద్యుల బృందం, ప్రాక్సిమల్ హ్యూమరస్ అలోగ్రాఫ్ట్తో కలిపి రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో సర్టిఫైడ్ బోన్ బ్యాంక్ ద్వారా పొందిన డోనర్ ఎముక టిష్యూ ద్వారా దెబ్బతిన్న భాగాన్ని పుననిర్మించారు. నాలుగు గంటల పాటు జరిగిన శస్త్ర చికిత్స అనంతరం రోగి పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.