17-09-2025 02:24:09 AM
గురుపూజోత్సవ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
108 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే మహోన్నత శిల్పులు ఉపాధ్యాయులేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
మంగళవారం అబిడ్స్లోని స్టాన్లీ కాలేజీలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి గురుపూజోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని, 108 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. “ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు చెప్పే యంత్రాలు కాదు, విద్యార్థుల భవిష్యత్తును చెక్కే శిల్పులు” అన్నారు.
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, ఫార్మా రంగాలకే కాదని, విద్యా రంగానికి కూడా రాజధానిగా విలసిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దుతున్నాం అన్నారు. కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ.. “ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులు తెస్తోందని, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని అన్నారు.
ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పై శిక్షణ ఇచ్చామని, హైదరాబాద్ జిల్లాను ఉత్తీర్ణత శాతంలో అగ్రస్థానంలో నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రోహిణి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.