24-01-2026 12:32:58 AM
సురక్షితంగా ఇంటికి చేరుకుందాం..
తాండూరు, జనవరి23 (విజయక్రాంతి): ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకుందాం.. రోడ్డును గౌరవిద్దాం..క్షేమంగా గమ్యం చేరుకుందాం.. అంటూ వికారాబాద్ జిల్లా తాండూరులో శుక్రవారం పోలీసులు (అలైవ్, అరైవ్) రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు మనోహర్ రెడ్డి, జిల్లా ఎస్పీ స్నేహ మెహర పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు కేవలం ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయడమే కాకుండా, ఆ కుటుంబం మొత్తాన్ని రోడ్డున పడేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా కుటుంబ పెద్దను కోల్పోయిన ఇళ్లు ఆర్థికంగా, సామాజికంగా చితికిపోతాయని... జిల్లా పోలీస్ శాఖ తరపున 2026 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలను కనిష్ట స్థాయికి తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్య సాధనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించడం అనేది భయం వల్ల కాకుండా, బాధ్యతగా భావించాలని వారు కోరారు. అంతకుముందు ఇందిరా చౌక్ నుండి సమావేశ వేదిక వరకు వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు, సామాజికవేత్తలతో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిఎస్పి నర్సింగ్ యాదయ్య మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.