19-08-2025 12:00:00 AM
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 18 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో శ్రావణమాసం చివరి సోమవారం నందీశ్వరుని రెండవ వార్షికోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు, సాయిబాబా దేవాలయ అర్చకులు వినయ్ కార్యక్రమాలను ప్రారంభించారు.
2023 ఆగస్టు 18 న నిజామాబాద్ సీపీ పోతరాజు సాయి చైతన్య కీర్తి దంపతుల ఆధ్వర్యంలో నందీశ్వరుని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం రెండవ వార్షికోత్సవం కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వరునికి, గణపేశ్వరునికి రుద్రాభిషేకం, త్రివేణి సంగమం జలాభిషేకం నిర్వహించారు.
అభిషేకం అనంతరం పూలమాలలో పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నందీశ్వరుని వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు, మహిళలకు అమ్మవారి గాజులను అందజేశారు.