19-09-2025 12:00:00 AM
సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు
సూర్యాపేట, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ వైద్యశాలలో వివిధ విభాగాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని కావున పెండింగ్ వేతనాలు వెంటనే అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వేంకటేశ్వర్లు అన్నారు. గురువారం ప్రభుత్వ వైద్యశాల వద్ద మూడు రోజులుగా దీక్షలు చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి, రెండు కాదు ఐదు నెలల పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు లేక పోతే కుటుంబాలు ఎలా గడుస్తాయో చెప్పాలన్నారు. ఇప్పటికే సీఐటీయూ, మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ కమీషనర్ కు, జిల్లా కలెక్టర్ కు వేతనాలు వెంటనే అందించాలని వినతి పత్రం అందించిన ఫలితం లేకుండా పోయిందన్నారు.
అర్హతలు ఉన్న ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి వెంటనే కాంట్రాక్ట్ ఇవ్వాలన్నారు. లేకుంటే విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దివాల్సి వస్తుందన్నారు. ఈయన వెంట యూనియన్ అద్యక్షుడు చికూరి అశోక్, రమాకాంత్, రమణ, జానకి రాములు, మధు, శ్యామ్, మోహినీ, స్వాతి, భవానీ, నారాయణ తదితరులు ఉన్నారు.