calender_icon.png 5 December, 2025 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికార పార్టీ వేధింపులకు సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య

05-12-2025 12:00:00 AM

  1. కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన బండారి రవీందర్
  2. తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని ఆ పార్టీ నేతల ఒత్తిడి
  3. సమగ్ర విచారణ జరిపించాలన్న బీఆర్‌ఎస్ నేతలు  

ఖానాపూర్, డిసెంబర్ ౪(విజయక్రాంతి): అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఒత్తిడి తట్టుకోలేక బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన బండారి పుష్ప భర్త రవీందర్( 54) గురు వారం ఆత్మహత్యకు పాల్పడడం ఖానాపూర్‌లో రాజకీయ దుమా రం రేపింది కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేర కు ఖానాపూర్ మండలంలోని సోమర్‌పేట గ్రామపంచాయతీని స్థానిక ఎన్నికల్లో బీసీ మహిళకు కేటాయించారు గతంలో ఎంపీటీసీగా పనిచేసిన బండారు రవీందర్ సర్పంచ్ పోటీ చేయాలని గత ఆరు నెలల నుంచి ప్రయత్నాలు చేశారు.

అయితే ఈ జీపీని బీసీ మహిళ కేటాయించడంతో తనకు అవకాశం దక్కలేదు. వారం రో జుల క్రితవరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బండారి పుష్ప రవీందర్ దంపతులు దీక్షా దివాస్‌లో బీఆర్‌ఎస్ నియోజకవర్గ జాన్సన్ నా యక్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.ఈనెల 11న జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో బీసీ మహిళా కోట కింద బీఆర్‌ఎస్ మద్దతుదారునుగా నామినేషన్ దాఖలు చేశారు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎంపీటీ సభ్యులు బండారు రవీందర్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కంగుతిన్నారు.

వెంటనే కొందరు ముఖ్య నేతలు పుష్ప రవీందర్ తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరాలని అలా చేరితే ఏకగ్రీవంగా సర్పంచ్ పదవి ఇస్తామని రాయబారాలు చేసినట్టు చెప్తున్నారు.అయితే వారు అందుకు నిరాకరించారు. తాము బీఆర్‌ఎస్ పార్టీలో చేరామని తిరిగి కాంగ్రెస్ పార్టీకి రాలేమని అలా చేస్తే తమ రాజకీయ ఉనికి ప్రమాదం ఉం టుందని కాంగ్రెస్ నేతలతో తేల్చి చెప్పినట్టు చెప్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మా ప్రభుత్వమని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మా ఎమ్మెల్యేని ఉన్నారని నీవు ఎలా గెలుస్తావో గెలిచినంక ఏం చేస్తావో చూస్తామని బెదిరింపులకు పాల్పడ్డట్టు చెప్తున్నారు.

దీంతో మనస్థాపానికి గురైన బండారి రవీందర్ బుధవారం రాత్రి ఇంటి సమీపంలోని పశువుల పాకలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీ జాన్సన్ నాయక్, పార్టీ నేతలు గురువారం అక్కడికి వెళ్లి తమ నాయకుడి ఆత్మహత్యకు వేధింపులే కారణమని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

సంఘటన స్థలాన్ని సీఐ అజయ్ కుమార్, ఎస్‌ఐరాహుల్ గైక్వాడ్ చేరుకొని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండారి పుష్పకు ఇద్దరు కుమారులు ఉన్నారు .ఇదిలా ఉండగా బండారి రవీందర్ అంత్యక్రియలను గురువారం నిర్వహించగా బీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి అంత్యక్రియలు పాల్గొన్నారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై లోతైన విచారణ సరిమితరువాతనే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.