19-09-2025 01:09:40 AM
-రూ.66 కోట్లు జప్తు చేయాలని క్యాబినెట్ తీర్మానమెందుకు చేసింది?
-ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకే క్యాబినెట్కు ఫైల్
-ఈ వ్యవహారంపై జ్యుడీషియరీ విచారణ జరపాలి
-మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ చెప్పినట్టుగానే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని క్యాబినెట్ తేల్చిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డబ్బులను జప్తు చేయాలని జీఓ నంబర్ 15 విడుదల చేసిందని, ధాన్యం టెండర్ల కుంభకోణంపై డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు.
రూ. 66 కోట్ల రూపాయలను జప్తు చేయాలని క్యాబినెట్ ఎందుకు తీర్మానం చేసిందో చెప్పాలన్నారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకు క్యాబినెట్ కు ఫైల్ వెళ్ళిందని స్పష్టం చేశారు. టెండర్ విలువ కంటే 230 రూపాయలు ఎక్కువ వసూలు చేశారని ఆరోపించారు. ధాన్యం కుంభకోణంపై కాంగ్రెస్ పార్టీలో రోశం ఉన్నవాళ్లు ఎక్కడా మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు. ధాన్యం టెండర్ల కుంభకోణంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రూ. 380 కోట్లకు రూ. 66 కోట్లు మాత్రమే జప్తు చేశారని తెలిపారు.
తప్పించుకోవడం కోసమే రూ. 66 కోట్లు జప్తు చేశారని చెప్పారు. టెండర్లు నలుగురు వేస్తే ఇద్దరికి మాత్రమే ఎందుకు పెనాల్టీ వేశారని ఆయనపే ర్కొన్నారు. డబ్బు మొత్తం రేవంత్ రెడ్డి కక్కాల్సిందేనని అన్నారు. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియరీ విచారణ జరపాలని సుదర్శనరెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సతీష్ రెడ్డి, పల్లె రవికుమార్, బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.